శిశుసంక్షేమానికి సర్కార్ పెద్దపీట

 శిశుసంక్షేమానికి సర్కార్ పెద్దపీట     


 


సర్కార్ హైదరాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని మంత్రి సత్యవతీ రాథోడ్ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


 



 


వీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. శాఖపై శుక్రవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. చనుబాల ప్రాధాన్యత పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన రేడియో ప్రకటనలను మంత్రి ఆవిష్కరించారు. శిశువు కడుపులో పడ్డప్పటి నుంచి తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని రకాలుగా ఆదుకునే పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు.   


 



 


మాతా- శిశు ఆరోగ్య రక్షణలో సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అందించేలా అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ శాఖలో పని చేసే వారికి హోదాలతో సంబంధం లేకుండా మనసుతో పనిచేసే తత్వం ఉండాలని కోరారు. దేశం మొత్తంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులకు అత్యధిక  


 



 


వేతనాలను తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు రాకున్నా... రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరిస్తూ స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.  



 


కేంద్ర ప్రభుత్వ పథకాలకు 60 శాతం నిధులు కేంద్రం నుంచి, 40శాతం నిధులు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సి ఉండగా... తెలంగాణలో 70 శాతంకి పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. మొత్తంగా అందరం కలిసి మహిళలు, శిశువులకు సరైన న్యాయం జరిగే విధంగా పనిచేద్దామని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 


 


తద్వారా దేశంలో మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమావేశం అనంతరం అక్కడున్న శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి వారి బాగోగుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. 



 


శిశువులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని, ఉద్యోగులుగా కాకుండా తల్లుల్లా పని చేయాలని అంగన్ వాడీలను మంత్రి ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్, సంచాలకులు విజయేంద్ర బోయి, జువెనైల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి. శైలజ తదితరులు పాల్గొన్నారు.


Comments