ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు


తాజాగా మరో 52 మందికి పాజిటివ్ కోయంబేడ్ మార్కెట్ లింకులతో కలకలం


 


అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. తాజాగా మరో 52 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం తాజాగా 9713 శాంపిల్స్ ని టెస్ట్ చెయ్యగా ఈ విషయం వెల్లడయ్యింది. ఆదివారం 25 కేసులు మాత్రమే నమోదు కావడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


వెంటనే ఒక్కరోజులోనే రెట్టింపు కావడం గమనార్హం. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2282కి చేరింది. ఐతే... వీటిలో 1527 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 50గా ఉంది.



కాబట్టి... ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 705గా ఉంది. ఈ 705 మందీ కోలుకునేలా చెయ్యగలిగితే... అదో విజయమే అనుకోవచ్చు. రోజూ కొత్తగా వస్తున్న కేసులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. తగ్గుతుందిలే అనుకునేలోపు మళ్లీ నెంబర్ పెరిగిపోతోంది.


కొత్తగా నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు మార్కెట్ లింకులున్నవి 19 ఉన్నాయి. వాటిలో చిత్తూరులో 12 ఉండగా, నెల్లూరులో 7 ఉన్నాయి. మొన్నటి వరకూ మర్కజ్ కేసులు ఆంధ్రా, తమిళనాడును వణికిస్తే, తాజాగా కోయంబేడు మార్కెట్ కేంద్రంగా నమోదవుతున్న కేసులు రెండు తెలుగు రాష్ట్రాలకూ కంటి మిద కునుకులేకుండా చేస్తున్నాయి.



ముఖ్యంగా ఎపిలోని పలు జిల్లాల్లో కేసులకు కోయంబేడుతో సంబంధాలు బయటపడుతున్నాయి. తమిళనాడులో మొత్తం 10,108 కేసులు ఉండగా, చెన్నరులో 5,947 ఉన్నాయి. వీటిలో దాదాపు మూడు వేలకు పైగా కోయంబేడు మార్కెట్ ద్వారా వచ్చినవే.


ఒక ఐపిఎస్ స్థాయి అధికారితో పాటు 250 మంది వరకు పోలీసులకు అక్కడి నుండి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కోయంబేడు వెళ్లి వచ్చిన వందలాది మంది రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.



రాష్ట్రంలో ఇప్పటివరకూ 263 కేసులకు కోయంబేడు మూలాలున్నాయని సమాచారం. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 16 మండలాల్లో 92 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కరోనా బాధితుల్లో మొత్తం 19 మందికి కోయంబేడుతో సంబంధాలు ఉన్నాయి.


ఇటీవల వరకూ చెన్నైకే పరిమితమైన కోయంబేడు ప్రభావం, గత 11 రోజులుగా ఆంధ్రాలోనూ చూపుతోంది. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ గా పేరుగాంచిన కోయంబేడు మార్కెట్లో 3,800 షాపులు ఉన్నాయి. 65 ఎకరాల్లో మార్కెట్ విస్తరించి ఉంది.



పూలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల క్రయవిక్రయాలు నిత్యం జరుగుతుంటాయి. పదివేల మంది ఈ మార్కెట్లో పని చేస్తున్నారు. ప్రతిరోజూ లక్షపైనే వ్యాపారులు, రైతులు వచ్చి వెళుతుంటారు.


రద్దీ రోజుల్లో రెండు లక్షలపైనే వస్తారు. గత ఏప్రిల్ 14న తమిళ ఉగాది రోజు భారీగా జనం తరలి వచ్చారు. దీంతో, తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ తెరిచే వేళలను కుదించింది.



రద్దీ ఎక్కువై భౌతిక దూరం పాటించలేని పరిస్థితి నెలకొంది. దీంతో, అమ్మకందారులకు కరోనా వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడింది. మే 5 నుంచి మార్కెట్ ను మూసేసింది.


అక్కడ అమ్మకందారులు, కార్మికులతో కాంటాక్టు ఉన్న వారు 16 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఖ్య సెకండరీ కారకాలతో కలిపి లక్ష దాటి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.



ముఖ్యంగా ఆంధ్రాలో చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం నుంచి తమ పంటలను అమ్ముకోవడానికి నిత్యం ఈ మార్కెట్ కు వెళ్లి వస్తుంటారు.


అలా వెళ్లిన వారిలో చిత్తూరులో 535 మంది, నెల్లూరు 275, అనంతపురం 310, తూర్పుగోదావరి 65, ప్రకాశం 150, గుంటూరులో 80 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం, కడప, కర్నూలులోనూ కోయంబేడు రిటర్న్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.



దాదాపు ఈ సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంటుందని అంచనా. వారం రోజుల క్రితం వరకూ పట్టణాలకే ఎక్కువగా పరిమితమైన కరోనా వైరస్... కోయంబేడు లావాదేవీలతో గ్రామాలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.


Comments