కేంద్రం ఆలోచనల మేరకు బ్యాంకులు సహకరించేనా?

కేంద్రం ఆలోచనల మేరకు బ్యాంకులు సహకరించేనా?


నేరుగా సాయం చేస్తేనే మేలు అంటున్న ప్రముఖులు


 


న్యూఢిల్లీ : ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్ని అధిగమించాలంటే చిత్తశుద్ధితో కేంద్రం ప్రయత్నం చేయడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులుఅంటున్నారు. కేంద్రం ప్రకటించిన విధంగా బ్యాంకుల నుంచి హామీలు రావాలని కోరుకుంటున్నారు. లేదా నేరుగా ప్రజలకు సాయం అందాలని అంటున్నారు.


అలాకాని పక్షంలో కేంద్రం ఎన్ని ప్రకటనలు చేసినా లాభం లేదంటున్నారు. భారీ అంకెలు చూపడానికి అన్నిటినీ గుదిగుచ్చిన వైనం కళ్లకు కడుతోంది. మున్ముందు ప్రకటించే ప్యాకేజీలైనా మెరుగ్గా రూపొందిస్తే ఈ పెను విపత్తునుంచి అందరూ క్షేమంగా బయటపడేందుకు వీలవుతుందని సూచిస్తున్నారు.


" alt="" aria-hidden="true" />


దేశంలో దాదాపు 70 లక్షల ఎంఎస్ఎంఈలున్నాయి. ఇందులో వంద కోట్ల టర్నోవర్ దాటిన యూనిట్లు 45 లక్షల వరకూ వుంటాయి. వీటికి ఏ హామి చూపకుండా నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం కలిగించారు. ఇందుకోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు.


 



అలాగే ఎంఎస్ఎంఈల పరిధిలోకి రావడానికి ఉన్న పరిమితుల్ని కూడా పెంచింది. ఈ చర్య వల్ల దేశంలోని అనేక సంస్థలు లబ్దిపొందుతాయని సర్కారు అంచనా. ఈ రుణాన్ని నాలుగేళ్ల వ్యవధిలో చెల్లించేందుకు, తొలి ఏడాది అసలు, వడ్డీ చెల్లింపులపై మినహా యింపు ఇచ్చేట్టు వెసులుబాటు ఇచ్చారు.



ఈ ఆసరాతో వ్యాపార కార్యకలాపాలు పెరగడంతోపాటు లక్షలాదిమందికి ఉపాధి భద్రత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. తన వంతుగా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించింది.


బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించడం తప్ప కేంద్రం ఇందులో తనకు తాను ఇస్తున్నదేమి లేదు. అయితే మన బ్యాంకులు ప్రభుత్వం ఆశించినట్లు చేస్తాయా అన్నది చూడాలి. కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ చెప్పినా వినవు.



రిజర్వ్ బ్యాంక్ 3 నెలలపాటు ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం విధిస్తే అది ఆచరణకొచ్చేసరికి ఏమైందో అందరికీ అనుభవమైంది. ఎంఎస్ఎంఈల విషయంలోనూ అంతకంటే మెరుగ్గా ఏమి వుండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


ఎలాంటి హామీ లేకుండా రుణాలిస్తే తాము ఇరుక్కుంటా మన్న భయం బ్యాంకులకు ఉంటుంది. వాటికి ఆర్ బీఐ నిబంధనలు గుర్తిస్తాయి. చివరకు ఎంఎస్ఎంఈ యజమానులకు ప్రయాస తప్ప ఫలితం కనబడదంటున్నారు.



దానికి బదులు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్రమే నేరుగా రుణ వితరణ చేయడం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో దీన్ని అమలు చేయడం వంటి ఆలోచనలు చేస్తే బాగుంటుందని అంటున్నారు.


తమకు అవసరమైన పెట్టుబడి మరోవిధంగా వచ్చే అవకాశం లేదు గనుక ఈ విషయంలో వాటి యజమానులు జాగ్రత్తగా వుంటారు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకూ, బడా వ్యాపారులకూ మాత్రమే ఎగొట్టే ఉద్దేశంతో రుణాలు తీసుకునే సంస్కృతి వుంది.


కనుక ఎంఎస్ఎంఈలకు నేరుగా రుణ సదుపాయం కల్పించడంలో జంకవలసిన పనిలేదు. లా డౌన్ కారణంగా దెబ్బతినివున్న ఎంఎస్ఎంఈలకు లిక్విడిటీ పరంగా వూతం అందించడమే ఈ చర్యలన్నిటి ఉద్దేశం.


ఈ దిశగా కేంద్రం కూడా ఆలోచన చేసివుంటే బాగుండేది. రైల్వేలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు తదితర సంస్థల్లోని కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాల్సిన పరిమితిని ఆర్నెల్లు పొడిగించారు. ఇందువల్ల వారికి పెనాల్టీ బెడద వుండదు. ఈ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేసే కాంట్రాక్టర్లకు వర్తింపజేయాలన్న స్పృహ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Comments